Showing posts with label General Issues. Show all posts
Showing posts with label General Issues. Show all posts

Monday 18 March 2024

నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.

 చాలామంది చెవిలో గుబిలి రావడం అనారోగ్య సూచకమని భావిస్తారు. అపరిశుభ్ర హేతువని అనుకుంటారు. నిజానికి ఆ గుబిలి వల్ల లాభమే తప్పా నష్టం ఏమీ లేదు.


బయట నుంచి వచ్చే సూక్ష్మమైన దుమ్ము,ధూళి కణాలను చెవి లోపలి భాగాల్లోకి పోకుండా ఈ గుబిలి అడ్డు పడుతుంది. అలా వెళ్ళినట్లయితే రకరకాల ఇన్ ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ విధం గా చెవి ని రక్షించే ఓ ఏర్పాటు అన్నమాట.


చెవిలోని గ్లాండ్స్ నుంచి ఈ గుబిలి అనేది వస్తుంది. 


గుబిలిని తీయాలంటే దాన్ని ముందు మెత్తబరచాలి. ఐ డ్రాప్స్ గాని,  బేబీ ఆయిల్ డ్రాప్స్ గాని లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్ గాని వేయాలి.


ఒకటి రెండు రోజులకి మెత్తబడుతుంది. అప్పుడు రబ్బర్ బల్బ్ సిరంజీ తో గోరువెచ్చటి నీళ్ళని చెవి లోకి చిమ్మించడి. మొత్తం వచ్చింతర్వాత పొడిగా తుడవాలి. మీకు ఇబ్బంది ఉంటే చెవి స్పెషలిస్ట్ దగ్గరకి వెళ్ళడం మంచింది. 

Thursday 27 April 2023

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ...

 కొంతమంది ఆదర్శాలు వల్లిస్తుంటారు.ఎలా అంటే అసలు నిజంగానే వీళ్ళు తమ జీవితాల్లో వాటిని పాటిస్తున్నారా అనిపిస్తుంది.చాలా గౌరవం కూడా కలుగుతుంది. అంత నమ్మశక్యంగా ఉంటాయి వాళ్ళ మాటలు.తీరా వాళ్ళ ఇళ్ళకెళ్ళినప్పుడు మాత్రం చెప్పేదానికి వ్యతిరేకంగా ఉంటాయి వ్యవహారాలన్నీ. ఇంగ్లీష్ భాష వల్ల ఎంత తెలుగు దెబ్బతింటున్నదీ ,సంస్కృతి మంట కలుస్తున్నదీ వివరిస్తూ ఓ పెద్దమనిషి వాట్సాప్ ల్లో తెగ మెసెజ్ లు పెడుతుండేవాడు. నిజం చెప్పొద్దు చాలా గంభీరంగా ఆకర్షణీయంగా కూడా వివరిస్తూండేవాడు. 

ఓసారి ఏదో శుభకార్యం నిమిత్తం ఆ పెద్దమనిషి ఇంటికెళ్ళా. అవీ ఇవీ మాట్లాడినతర్వాత ఆయన గారి మనవళ్ళతో మాట్లాడితే తెలిసింది. ఒక్కరంటే ఒక్కరు కూడా తెలుగు మీడియం లో చదవడం లేదు అని. మతి పోయింది,ఏమిటి ఎంత ఆవేదన తో తెలుగు గురించి మధనపడుతుంటాడు ఆ పెద్ద మనిషి.ఇంగ్లీష్ వచ్చి సంస్కృతిని నాశనం చేస్తోందని తెగ బాధపడే ఆయన తన మనవళ్ళలో ఒక్కడిని కూడా తెలుగు మీడియం లో చేర్చలేకపోయాడు.

అనగూడదు గాని తెలుగువాళ్ళ లో ఉండే ఇంత హిపోక్రసీ మరెవ్వరి లో ఉండదేమో.అడిగినా ఏదో డొంకతిరుగుడు సమాధానం రెడీమేడ్ గా పెట్టుకుని ఉంటారు ఇలాంటివాళ్ళు.కొన్నంతే,విని ఊరుకొవడానికే పనికొస్తాయి.    

 

Thursday 20 April 2023

జావా ఆఫ్ ఇండియా అని ఈ పట్టణాన్ని ఎందుకు పిలుస్తారో తెలుసా..?

 Java of India అని మన దేశం లో ఏ పట్టణాన్ని పిలుస్తారో తెలుసా..? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న గోరఖ్ పూర్ ని ఆ విధం గా పిలుస్తారు. అంతే కాదు, ఆ పట్టణం ఆధ్యాత్మిక,సిద్ధ పురుషులకి పెట్టింది పేరు. ప్రసిద్ధ నాథ్ సంప్రదాయానికి పట్టుగొమ్మ ఈ స్థలం. మత్స్యేంద్రనాథ్ మహాశయులు స్థాపించిన ఆలయం ఇప్పటినుంచి కాదు ఎన్నో తరాల నుంచి పేరెన్నిక గన్నది.గోర్ఖ్ పూర్ పట్టణం అత్యంత పురాతన పట్టణం.గీతా ప్రెస్ అంటే తెలియంది ఎవరికి.ఆ ప్రెస్ ఇక్కడ నుంచే నడిచేది.


రాప్తీ నదీ తీరాన,లక్నో కి తూర్పున 272 కి.మీ. దూరం లో ఉంటుంది.నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ కి ప్రధాన కేంద్రం కూడా.ఒకానొకప్పుడు బస్తీ,దియోరియొ,అజం ఘడ్,నేపాల్ లోని తరాయ్ వీటన్నిటిని కలిపి ప్రసిద్ధ ఆర్యవర్తం లోని క్షేత్రాలుగా పిలిచేవారు.ఇక్కడకి వచ్చిన వారు కపిలవస్తు,లుంబిని,కుషీనగర్,గోరఖ్ నాథ్ ఆలయం  ఇలాంటివి చూడాలి. చౌరిచౌరా ఘటన లో అమరులైనవారికి స్మారక స్థూపం నిర్మించారు.ఇదీ చూడవలసిందే.

ఇక్కడ హిందీ,ఉర్దూ మాట్లాడుతారు.అలాగే భోజ్ పూరి కూడా. ప్రతిరోజు ఇక్కడినుంచి ఢిల్లీకి 13 రైళ్ళు నడుస్తాయి.బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని హిల్ స్టేషన్ గా పరిగణించారు.నేపాల్ కి బోర్డర్ లో ఉండే పట్టణాల్లో ఇది ఒకటి.అన్నట్టు ఈ ప్రాంతాన్ని జావా ఆఫ్ ఇండియా అని ఎందుకు పిలుస్తారో తెలుసా ..? ఇక్కడ ఎక్కువగా చెరుకు మిల్లులు ఉంటాయి.దానివల్లనే ఆ పేరు వచ్చింది.